గ్రామదేవతకు జాతరగానీ,సంబరం చేసే సమయంలో గరగల వారు వీటీని తలపై ధరించి డప్పుల శబ్దానికి అనుగుణంగా లయబద్దంగా నృత్యం చేస్తూ ఊరంతా తిరుగుతారు.ఇత్తడితో ప్రత్యేకంగా చెయ్యబడిన పూర్ణకుంభంలాంటి పాత్రని గరగ అని అంటారు.ఈ పాత్రపైన ఐదు తలలు కలిగిన సర్పం ప్రతిమ ఉంటుంది.
జాతర జరిగే సమయంలో పూజారి అమ్మవారిని తల్లీ నీకు జాతర మహుత్సవాలు చేస్తున్నాము కావున నువ్వు ఈ గరగలోకి అవహించమ్మా..అని ప్రార్ధిస్తాడు.అపుడు అమ్మవారు ఆ గరగలోనికి అవహిస్తుందని భక్తుల నమ్మకం.అపుడు ఆగరగకు పూజాదులు నిర్వహించి పసుపు-కుంకుమలు మరియు వస్త్రముతో అలంకరిస్తారు.
ఇలా అలంకరించిన అమ్మవారిని ప్రతి స్వరూపమైన గరగని కాళ్ళకి గజ్జెలు కట్టుకుని ప్రత్యేక వస్త్రాలను ధరించి గణాచారి శిరస్సుపై ఉంచుకుని నృత్యం చేస్తూ ఊరిలోని ప్రతి ఇంటికి తిరుగుతాడు.ముఖ్యంగా రజక,కుమ్మరి కులాలకు చెందిన వ్యక్తులు ఈ గరగలను ఎత్తుకుంటారు.
గరగలను తలపై ఎత్తుకుని వచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చినపుడు భక్తులు అ గరగలని అమ్మవారి స్వరూపంగా భావించి ధూప,దీప నైవేద్యాలు సమర్పిస్తారు.సాధారణంగా ఈ గరగల నృత్యం చేసేవారు సుమారు ఆరు నుండి 16 మంది వరకూ ఉండేదరు.వీరు డప్పుల శబ్దానికి అనుగుణంగా గరగని కిందకి పడనివ్వకుండా చేసే నృత్యం చూపరులను ఆకట్టుకుంటుంది.